కలం, జనగామ: జిల్లాలో సంచలనం రేపిన మృతుడి పేరుతో రిజిస్ట్రేషన్ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. జనగామ (Jangaon) సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సోమవారం ఆకస్మిక సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టిన అధికారులు కార్యాలయంలోని రిజిస్ట్రేషన్ రికార్డులు, కంప్యూటర్ డేటాను సవివరంగా పరిశీలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, నకిలీ ఆధార్ వివరాలు లేదా తారుమారు చేసిన పత్రాల ఆధారంగా ఈ రిజిస్ట్రేషన్ జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో కొంతమంది మధ్యవర్తులు, అలాగే కార్యాలయ సిబ్బంది ప్రమేయం ఉండే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. సోదాల సమయంలో ఇన్స్పెక్టర్ రాకేష్, సీఐ గౌతమ్ రెడ్డి, ఎమ్మార్వో లక్ష్మణ్ తదితర అధికారులు పాల్గొన్నారు. విచారణ కొనసాగుతుండగా, పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

