కలం, నల్లగొండ: బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావుల మధ్య చేరి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కొత్త డ్రామా నడిపిస్తున్నారని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, జయవీర్ రెడ్డితో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులకు తాము ఒకటే సవాల్ విసురుతున్నామన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ అవినీతి పాలనకు, రెండున్నర కాంగ్రెస్ పాలనపై అసెంబ్లీ వేదికగా చర్చించడానికి సీఎం రేవంత్ పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ‘కేటీఆర్. మీకు నిజంగా దమ్ముంటే, ధైర్యముంటే మీ తండ్రి కేసీఆర్ని (KCR) అసెంబ్లీకి తీసుకుని రండి. అక్కడ తేల్చుకుందాం” అని సవాల్ విసిరారు.
ఒక మేధావిగా చెప్పుకునే ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్.. ఒక దళిత మంత్రి అయిన అడ్లూరి లక్ష్మణ్పై దుర్మార్గమైన, నిరాధారమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటని వేముల వీరేశం మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో గురుకులాల్లో జరిగిన భారీ అవినీతి, అక్రమాలపై ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్, హరీశ్ రావు ఇద్దరూ తోడు దొంగలుగా మారి, పదేండ్లలో తెలంగాణను సర్వనాశనం చేశారని వేముల ధ్వజమెత్తారు.
“గత దొరల గడీలను బద్దలు కొట్టి, ఇవాళ రాష్ట్రంలో ప్రజా పాలన తీసుకొచ్చి ప్రజలకు మేలు చేస్తున్నాం. బీఆర్ఎస్ విసిరిన సవాల్ను అంగీకరించి మా మంత్రులు గన్ పార్క్ వద్దకు వస్తే.. కేటీఆర్, హరీశ్ రావులు తోకముడిచి పారిపోయారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి వీరు ఇవే డ్రామాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇప్పటికైనా చౌకబారు డ్రామాలు మాని, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజలకు సేవ చేయడం నేర్చుకోండి” అని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.

