కలం, నిర్మల్ : పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను ఐటీఐ ఏటీసీలతో అనుసంధానం చేసే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ (SFI) జిల్లా కన్వీనర్ దిగంబర్ డిమాండ్ చేశారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో తీసుకొచ్చిన శక్తి పాలసీ ద్వారా డిప్లమా కోర్సులను ఐటీఐ ఏటీసీలతో అనుసంధానం చేయడం సరికాదన్నారు.
విద్యారంగాన్ని ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ పేరుతో ఎస్బీటీఈటీని తొలగించే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలన్నారు. పాలిటెక్నిక్ కోర్సులను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లి ఇంజనీరింగ్ కోర్సులుగా అప్ గ్రేడ్ చేయాల్సింది పోయి డీగ్రేడ్ చేసే చర్యలను ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు.

