కలం, స్పోర్ట్స్ : ఆసియా గేమ్స్ (Asian Games) ప్రారంభానికి ముందే భారత క్రికెట్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. సీనియర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమయ్యారు. అతని స్థానంలో యువ లెగ్ స్పిన్ ఆల్రౌండర్ విప్రాజ్ నిగమ్ను భారత స్క్వాడ్లోకి ఎంపిక చేశారు. తొలుత హ్యామ్స్ట్రింగ్ గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన వరుణ్, అఫ్ఘానిస్థాన్తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో బౌలింగ్ చేశారు. అయితే ఆ మ్యాచ్లోనే ఆయనకు సైడ్ స్ట్రెయిన్ (పక్కటెముకల గాయం) ఏర్పడింది.
దీంతో ఆయన అఫ్ఘాన్ సిరీస్లోని మిగిలిన మ్యాచ్లతో పాటు ఆసియా గేమ్స్ (Asian Games)కు కూడా దూరమయ్యారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కోలుకోవడానికి మరింత సమయం పడుతుండటంతో ఆయన స్థానంలో విప్రాజ్ను తీసుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్లో మెరిసిన 22 ఏళ్ల విప్రాజ్ నిగమ్, ఇప్పటివరకు 19 మ్యాచ్ల్లో 13 వికెట్లు తీశారు. అంతేకాకుండా 176 స్ట్రైక్ రేట్తో హిట్టింగ్ చేయగల సామర్థ్యం కూడా ఆయనకు ఉంది.జపాన్లోని ఐచి-నాగోయాలో సెప్టెంబర్ 19 నుంచి ఆసియా గేమ్స్ ప్రారంభం కానున్నాయి. పురుషుల క్రికెట్ పోటీలు సెప్టెంబర్ 24 నుంచి మొదలవుతాయి.

