కలం, వెబ్డెస్క్: 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) పేరు ఇప్పుడు భారత క్రికెట్లో హాట్ టాపిక్గా మారింది. ఐపీఎల్ (IPL)లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ యువ ఆటగాడికి త్వరలోనే ఇండియా-ఏ జట్టులో అవకాశం దక్కనున్నట్లు సమాచారం వచ్చింది. వచ్చే నెల శ్రీలంకలో జరిగే ట్రై సిరీస్ కోసం తిలక్ వర్మ కెప్టెన్గా వెళ్లే జట్టులో వైభవ్ చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సీజన్ ఐపీఎల్లో వైభవ్ ఇప్పటికే 583 పరుగులు చేసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.
అతని ఆటను చూసిన అభిమానులు, మాజీ క్రికెటర్లు అతడిని త్వరగా భారత సీనియర్ జట్టులోకి తీసుకురావాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా వైభవ్ను ప్రత్యేక ప్రతిభ కలిగిన ఆటగాడిగా అభివర్ణించారు. బీసీసీఐతో పాటు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ అతడికి సరైన మార్గదర్శనం ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఆటలో ప్రతిభతో పాటు మానసిక ధైర్యం కూడా చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
వైభవ్కు (Vaibhav Suryavanshi) ఉన్న నైపుణ్యం భారత జట్టుకు చాలా సంవత్సరాలు ఉపయోగపడేలా చూడాలని ప్రయత్నిస్తామని ఆయన వెల్లడించారు. అయితే ప్రతి క్రికెటర్లాగే వైభవ్ కెరీర్లో కూడా ఎత్తుపల్లాలు ఉండొచ్చని, వాటిని ఎలా ఎదుర్కొంటాడన్నదే అతని భవిష్యత్తును నిర్ణయిస్తుందని భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం వైభవ్ ముందు పెద్ద బాధ్యత ఉంది. రాజస్థాన్ రాయల్స్ను (RR) ఐపీఎల్ ఫైనల్కు తీసుకెళ్లాల్సిన బాధ్యత అతని భుజాలపై ఉంది.
ఫైనల్కు చేరి విరాట్ కోహ్లీ జట్టు ఆర్సీబీకి సవాల్ విసరాలంటే ముందుగా ఎలిమినేటర్లో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించాలి. అది సాధిస్తే క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్తో మరో కీలక పోరు ఎదురుకానుంది. ప్లేఆఫ్ వ్యవస్థలో నాలుగో స్థానంలో నిలిచిన జట్టు ఇప్పటివరకు టైటిల్ గెలవలేదు. ఇప్పుడు ఆ చరిత్రను మార్చాలంటే వైభవ్ సూర్యవంశీ మరోసారి మెరిసిపోవాల్సిందే.
Read Also: భారత క్రీడా దిగ్గజం రంధీర్ సింగ్ కన్నుమూత
Read Also: డిజిటల్ విప్లవం

