కలం, మోత్కూరు: ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలు మరువబోమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) అన్నారు. తెలంగాణ రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యులుగా నియామకమైన కాసోజు శంకరమ్మ, చిట్వాల శ్వేతకు శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై మాట్లాడారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వీరనారి చాకలి అయిలమ్మ వారసురాఆలు శ్వేతకు, మలి దశ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి, కమిషన్ సభ్యులుగా నియమించిందన్నారు.
హామీ నెరవేర్చాం..
ఎన్నికల సమయంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడితే పోరాటయోధులు, వారి కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్, అందెశ్రీతో పాటు పలువురికి ప్రభుత్వం పారితోషకం అందించినట్లు మంత్రి అడ్లూరి తెలిపారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ విద్యార్థులకు కార్పొరేట్ స్ధాయి విద్య అందించడానికి ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రెటేడ్ స్కూల్ నిర్మాణం చేస్తున్నారని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత తదితరులు పాల్గొన్నారు.

