కలం, వెబ్ డెస్క్ : ఐర్లాండ్తో (Ireland) జరిగిన రెండు టీ20 మ్యాచ్లలో భారత జట్టు వరుసగా ఓటములు చవిచూడడంతో ప్రస్తుతం క్రికెట్ వర్గాలలో ఒకే అంశంపై చర్చ సాగుతోంది. 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీని (Vaibhav Sooryavanshi) తుది జట్టులోకి ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నలు అభిమానులలో వినిపిస్తున్నాయి. అయితే ఈ సిరీస్ చూపించిన అసలు సమస్య వైభవ్ ఆడకపోవడం కాదని, విదేశీ పరిస్థితులలో అనుభవజ్ఞులైన భారత టాప్ ఆర్డర్ వైఫల్యమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐపీఎల్ 2026 సీజన్లో 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడంతో పాటు అత్యధిక సిక్సర్లు బాది క్రిస్ గేల్ రికార్డును అధిగమించిన వైభవ్ సూర్యవంశీ, తన ప్రతిభతో టీ20 జట్టులో చోటు సంపాదించాడు. అయితే ఐర్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్లలో అతనికి తుది జట్టులో అవకాశం లభించలేదు.
పచ్చిక పిచ్లు, స్వింగ్కు అనుకూలమైన పరిస్థితులు, అదనపు బౌన్స్ను దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాడిని తొందరగా విదేశీ సిరీస్లో పరీక్షించకూడదని జట్టు యాజమాన్యం భావించినట్లు తెలుస్తోంది. అందుకే అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటి అనుభవజ్ఞులపై నమ్మకం ఉంచారు. అయితే ఈ వ్యూహం ఫలించలేదు. రెండు మ్యాచ్లలో భారత టాప్ ఆర్డర్ స్వింగ్ బౌలింగ్ను ఎదుర్కోలేక వరుసగా వికెట్లు కోల్పోయింది. తొలి టీ20లో బ్యాటింగ్ పూర్తిగా కుప్పకూలగా, రెండో మ్యాచ్లో తొలి రెండు బంతులలోనే ఇద్దరు ఓపెనర్లు ఔటవడం జట్టును తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది.
స్వదేశంలో దూకుడుగా ఆడే బ్యాటింగ్ విదేశీ పరిస్థితులలో ప్రతిసారి విజయవంతం కాదని ఈ సిరీస్ మరోసారి రుజువు చేసింది. స్వింగ్ బౌలింగ్ను ఎదుర్కొనే ఓపిక, తొలి స్పెల్ను జాగ్రత్తగా ఆడే టెక్నిక్ వంటి అంశాలలో భారత బ్యాటర్లు వెనుకబడ్డారు. ఈ సిరీస్ తర్వాత ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వలేదన్నదే కాకుండా, విదేశీ పరిస్థితులలో అనుభవజ్ఞులైన టాప్ ఆర్డర్ ఎందుకు స్థిరంగా నిలబడలేకపోయిందన్నదే. ఐర్లాండ్ పర్యటన టీమిండియాకు కీలక లోపాలను స్పష్టంగా చూపించిందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

