కలం, స్పోర్ట్స్ : బిహార్కు చెందిన 15 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) సరికొత్త రికార్డు సృష్టించారు. భారత టీ20 సీనియర్ జట్టుకు ఆయన తొలిసారి ఎంపికయ్యారు. దీంతో భారత టీ20 చరిత్రలోనే అంతర్జాతీయ వేదికపైకి అరంగేట్రం చేస్తున్న అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ నిలిచాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు ఆసియా గేమ్స్ కోసం బీసీసీఐ ప్రకటించిన మూడు జట్లలోనూ వైభవ్కు చోటు దక్కింది. ఈ వార్త తెలియగానే ఆయన సొంత గ్రామం తాజ్పూర్లో పండగ వాతావరణం నెలకొంది. బంధువులు, గ్రామస్థులు వైభవ్ ఇంటికి తరలివచ్చి మిఠాయిలు పంచుకుంటూ, పటాకులు కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.
వైభవ్ ఐదేళ్ల వయసు నుంచే క్రికెట్ ఆడటం ప్రారంభించారు. ఆయన తండ్రి సంజీవ్ సూర్యవంశీ కొడుకులోని ప్రతిభను గుర్తించి ఎంతో శ్రమించారు. రోజూ రెండున్నర గంటలు ప్రయాణించి పాట్నాలోని అకాడమీకి తీసుకువెళ్లేవారు. తల్లి ఆర్తి సింగ్ తెల్లవారుజామున 3 గంటలకే లేచి ఆయనకు భోజనం సిద్ధం చేసేవారు. తల్లిదండ్రుల త్యాగాల ఫలితంగా వైభవ్ (Vaibhav) కేవలం 12 ఏళ్లకే రంజీ ట్రోఫీ, 13 ఏళ్లకే ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు.
2026 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ 72 సిక్సర్లతో 776 పరుగులు చేశారు. అంతకుముందు అండర్-19 ప్రపంచకప్, ఎమర్జింగ్ ఆసియా కప్లలో అద్భుతంగా రాణించారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు కూడా ఆయనను ప్రశంసించారు. తన కొడుకు దేశానికి ఆడాలనే కల నెరవేరినందుకు తండ్రి సంజీవ్ ఆనందం వ్యక్తం చేశారు.
Read Also: బైకర్లకు ఎయిర్ బ్యాగ్.. కరీంనగర్ విద్యార్థికి జాతీయ గుర్తింపు
Follow Us On: Instagram

