కలం, వెబ్ డెస్క్: తెలంగాణపై బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య (Tejasvi Surya) చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravichandra) ఖండించారు. తేజస్వి సూర్య బేషరతుగా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ పెట్టి 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ వచ్చిందని గుర్తుచేశారు. స్వరాష్ట్ర కాంక్షే లక్ష్యంగా అనేక మంది ఉద్యమించి చనిపోయారని.. బలిదానాలు ఇచ్చారని గుర్తు చేశారు. బ్రిటిష్ వారు విడదీసిన పాకిస్తాన్ తో పోలుస్తూ తెలంగాణ మీద మాట్లాడం సరైనది కాదు అని అన్నారు. రీసెంట్ గా టీడీపీ ఎంపీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బ్లాక్ డే గా మాట్లాడారని ఫైర్ అయ్యారు. కేంద్రం తీసుకువస్తోన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు బిఆర్ఎస్ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఇక నియోజకవర్గాల పునర్విభజన అంశంపై బిల్లుపై లోక్ సభలో ఏం జరుగుతుందో చూసి మాట్లాడుతామని చెప్పారు.

