కలం, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల (central govt employees) జీతభత్యాల్లో కీలక మార్పులు జరగనున్నాయి. వారిని 8వ పే కమిషన్ (8th Pay Commission) అతి త్వరలో తీపి కబురు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కమిషన్ ఏర్పాటుతో కొత్త జీతాల నిర్మాణంపై కసరత్తు వేగవంతమైంది. తాజాగా ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లతో కూడిన నివేదికను కమిషన్కు సమర్పించాయి. 2026 జనవరి 1వ తేదీ నుండి ఈ కొత్త వేతనాలు అమలులోకి రానున్న నేపథ్యంలో, ఉద్యోగుల జీతాలు ఎంత పెరగనున్నాయి? అసలు సంఘాల ప్రధాన డిమాండ్లు ఏంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. గతేడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఏర్పాటైన 8వ వేతన సంఘం, ప్రస్తుతం వివిధ ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఉద్యోగుల జీతాలు, అలవెన్సులు, పెన్షన్ల మార్పులపై ఈ కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేయనుంది. ఈ సిఫార్సులు ఎప్పుడు అమలైనా, 2026 జనవరి నుండి వర్తించేలా బకాయిలు కూడా అందుతాయి.
కీలక మార్పులు ఇవే..
ఈ వేతన సంఘం ప్రధానంగా బేసిక్ పే (Basic Pay) ని సవరిస్తుంది. దీని ఆధారంగానే డీఏ (DA), హెచ్ఆర్ఏ (HRA), ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, పెన్షన్లు మారుతాయి. ప్రస్తుతం ఉన్న జీతాన్ని కొత్త వేతనంగా మార్చేందుకు ‘ఫిట్మెంట్ ఫ్యాక్టర్’ను ఉపయోగిస్తారు.
7వ పే కమిషన్ (2016): ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉంది, దీనివల్ల కనీస వేతనం రూ.18,000గా నిర్ణయించారు.
8వ పే కమిషన్ (8th Pay Commission) (డిమాండ్): జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NC-JCM) ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను 3.83కి పెంచాలని కోరుతోంది. ఇదే జరిగితే కనీస బేసిక్ పే రూ.69,000కు చేరుతుంది.
2016 నుండి పెరిగిన ద్రవ్యోల్బణం వల్ల సామాన్యుడిపై భారం పెరిగిందని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఇళ్లు, విద్య, వైద్య ఖర్చులు భారీగా పెరిగాయని, డీఏ ఇప్పటికే 50 శాతాన్ని దాటడం ధరల పెరుగుదలకు నిదర్శనమని వారు వివరిస్తున్నారు. అందుకే ప్రస్తుత జీవన ప్రమాణాలకు అనుగుణంగా జీతాలు ఉండాలని వారు కోరుతున్నారు.
ప్రధాన డిమాండ్లు:
కనీస వేతనం రూ. 69,000 చేయాలి.
ఏడాదికి 6 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి.
కనీస హెచ్ఆర్ఏ (HRA) 30 శాతంగా ఉండాలి.
పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలి.
చివరిగా తీసుకున్న జీతంలో 67 శాతాన్ని పెన్షన్గా ఇవ్వాలి.
పెన్షనర్లపై ప్రభావం..
జీతాల పెంపు వల్ల పెన్షనర్లకు కూడా భారీ ప్రయోజనం చేకూరనుంది. బేసిక్ పే పెరిగితే ఆటోమేటిక్గా పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ కూడా పెరుగుతాయి. డీఏ పెంపు కంటే పే కమిషన్ సిఫార్సులే పెన్షనర్లకు ఎక్కువ లాభాన్ని చేకూరుస్తాయి.

