కలం, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్ చమోలీ (Uttarakhand Tunnel Incident) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలోకి గత రాత్రి అకస్మాత్తుగా భారీ వరద నీరు రావడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. ఒక కార్మికుడు గల్లంతైనట్లు తెలుస్తోంది. శిథిలాల కింద పడి 14 మంది కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వరద కారణంగా సొరంగంలో మొత్తం 22 మంది కార్మికులు చిక్కుకుపోయారు. సొరంగం ప్రవేశద్వారం నుంచి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో భారీగా బురద, నీరు ఉదృతంగా రావడంతో కార్మికులు చిక్కుకుపోయారు. సొరంగం లోపల సుమారు 1.8 కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్న ఒక గుహ నుంచి నీరు, శిథిలాలు ఉధృతంగా వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.

