కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని బాందా జిల్లా బిసండా పట్టణ సమీపంలో బుధవారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుకతో వెళ్తున్న ఒక వేగవంతమైన ట్రక్ రోడ్డుపై వెళ్తున్న వారిపైకి దూసుకెళ్లడంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఇసుక లారీ మొదట రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక 61 ఏళ్ల రిటైర్డ్ ఉపాధ్యాయుడిని ఢీకొట్టింది. ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత నియంత్రణ కోల్పోయిన ట్రక్ రోడ్డు పక్కనే ఉన్న ఈ-రిక్షాపై బోల్తా పడింది.
ఈ సంఘటనలో ఈ-రిక్షాలో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోగా, తీవ్ర గాయాలపాలైన మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రమాద తీవ్రతకు ఈ-రిక్షా పూర్తిగా నలిగిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే బాందా జిల్లా మేజిస్ట్రేట్ అమిత్ అసేరి, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన నలుగురిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

