కలం, వెబ్ డెస్క్ : హర్మూజ్ జలసంధి సమీపంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన డ్రోన్ దాడులను అమెరికా సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇందులో భాగంగా ఆత్మరక్షణ కోసం హర్మూజ్ జలసంధి పరిసరాల్లో ఉన్న ఇరాన్ సైనిక స్థావరంపై అమెరికా ఎదురుదాడులకు (US Strikes) దిగింది.
ఈ ఆపరేషన్ లో ఇరాన్ కు చెందిన పలు డ్రోన్లను అమెరికా బలగాలు కూల్చివేసినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది. అమెరికా దళాలకు, వాణిజ్య నౌకల రాకపోకలకు ముప్పుగా మారిన ఇరాన్ డ్రోన్ నియంత్రణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త దాడులు జరిగినట్లు ఒక ఉన్నతాధికారి తెలిపారు. అమెరికా జరిపిన ఈ దాడుల వల్ల బందర్ అబ్బాస్ ఓడరేవు సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. అయితే అమెరికా చేసిన ఈ చర్య తమ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

