కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలోనే అత్యధిక వరి సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ధాన్యం కొనుగోళ్లలో ముందంజలో నిలిచిందని చెప్పారు. ఈ రబీ సీజన్లో సుమారు 65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే, 141 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా వేస్తున్నామని వివరించారు. ఇందులో 90 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇప్పటివరకు 17.28 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని ప్రకటించారు.
తమ ధాన్యాన్ని విక్రయించిన రైతులకు ఇప్పటికే రూ.2310 కోట్లు చెల్లించామని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో మౌలిక సదుపాయాలపై ప్రతిపక్షాలు, కొన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని వివరించారు. వర్షాల నుంచి ధాన్యాన్ని రక్షించేందుకు 2.63 లక్షల టార్పాలిన్లు ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. ఇంత భారీ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లు గతంలో ఎప్పుడూ జరగలేదని అన్నారు.

