కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు (US Iran War) అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కనబెట్టి, ఇరాన్ భూభాగమే లక్ష్యంగా అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. తమ అపాచీ హెలికాప్టర్ను కూల్చివేసినందుకు ప్రతికారంగా యూఎస్ సెంట్రల్ కమాండ్ ఈ భారీ వైమానిక దాడులకు దిగింది. రాజధాని టెహ్రాన్తో పాటు సిరిక్, మినాబ్, బందర్ అబ్బాస్ సహా దాదాపు 20 కీలక ప్రాంతాలపై అమెరికా క్షిపణుల వర్షం కురిపించింది. ఈ ఊహించని పరిణామంతో అప్రమత్తమైన ఇరాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను యాక్టివేట్ చేసింది.
అమెరికా దాడులకు ఇరాన్ సైతం అదే స్థాయిలో సమాధానమిచ్చింది. బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులతో ఎదురుదాడులకు తెగబడింది. ఇరు దేశాల మధ్య పోరు తీవ్రం కావడంతో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిను ఇరాన్ మరోసారి మూసివేసింది. దీనివల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరాకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఏర్పడింది.
తీవ్ర పరిణామాలు ఉంటాయి : ట్రంప్
మరోవైపు ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. శాంతి ఒప్పందం కుదుర్చుకోకుండా ఇరాన్ కాలయాపన చేస్తోందని, ఇప్పటికే ఆ దేశం సైనిక పరంగా భారీగా నష్టపోయిందని ఆయన పేర్కొన్నారు. తమ సైనిక స్థావరాలపై దాడులు చేసినందుకు ఇరాన్ భవిష్యత్తులో మరింత భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ట్రంప్ ఘాటుగా హెచ్చరించారు. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది.

