కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అక్వేరియం షాప్లో యువతి కొంతకాలంగా పనిచేస్తోంది. షాప్ యజమాని ఆకుల నరేష్ ఆమెకు దగ్గరై కూల్డ్రింక్లో మత్తు మందు కలిపి ఇచ్చి, అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పేర్కొంది. తరువాత విషయాన్ని గుర్తించి నిలదీయగా.. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ గొంతు నులిమి బెదిరించినట్లు వివరించింది. కొంతకాలం మౌనంగా ఉన్న బాధితురాలు, చివరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించాడు. ఇటీవల మరోసారి పెళ్లి విషయమై అడగ్గా, మాట మార్చినట్లు వాపోయింది. యువతి ఆరోపణలు స్థానికంగా సంచలనం కలిగించాయి.

