కలం, వెబ్ డెస్క్ : అమెరికా, ఇరాన్ల (US-Iran War) మధ్య యుద్ధ మేఘాలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు ఆగడం లేదు. ఈ క్రమంలోనే దక్షిణ ఇరాన్లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్కు చెందిన కుహెస్తక్ లో ఘోర ప్రమాదం విషాదం చోటు చేసుకుంది. వివాహ వేడుకతో కోలాహలంగా ఉన్న ఓ ఇంట్లో అమెరికా బాంబుల దాడి చేయడంతో అక్కడి జనం ఒక్కసారిగా ప్రాణభయంతో పరుగులు తీశారు.
ఈ ఘటనలో చిన్నారితో సహా ఐదురుగు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 68 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని ఇరాన్ అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
అమెరికాకు ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్
నిరపరాధులైన పౌరులు, చిన్నారులు ఉన్న పెళ్లింటిపై అమెరికా దాడి చేయడాన్ని ఇరాన్ సుప్రీమ్ లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా ఖండించారు. అమెరికా ఆకృత్యాలకు స్వస్తి చెప్పే కాలం దగ్గరపడిందని మండిపడ్డారు. వాషింగ్టన్ చేసిన ఈ దుశ్చర్యకు తమ సాయుధ బలగాలు త్వరలోనే మర్చిపోలేని రీతిలో గుణపాఠం చెబుతాయని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ఘటనతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

