కలం, వెబ్ డెస్క్: గత కొద్దిరోజులుగా భానుడి భగభగలతో మండిపోతున్న తెలంగాణ ఒక్కసారిగా చల్లబడింది. వర్షపు జల్లులతో తడిసి ముద్దైంది. వర్షం (Rains) కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వడగండ్లు వాన బీభత్సం సృష్టించింది. ఆకాశం మేఘావృతమై అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షానికి తోడు బలమైన గాలులు వీయడంతో జనజీవనం స్తంభించిపోయింది. పలుచోట్ల పెద్ద పెద్ద వడగండ్లు పడటంతో చేతికి వచ్చిన పంటలు దెబ్బతిని రైతులు ఆందోళన చెందుతున్నారు. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద ఉండొద్దని అధికారులు సూచించారు.
తెలంగాణలో (Telangana) కురుస్తున్న అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. అదును కాని సమయంలో కురుస్తున్న వానలు, ఈదురు గాలుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ముఖ్యంగా కోతకు సిద్ధంగా ఉన్న వరి, జొన్న, మొక్కజొన్న పంటలు నేలవాలింది. వడగండ్లు ధాటికి మామిడి, బొప్పాయి వంటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మార్కెట్ యార్డులకు తరలించిన ధాన్యం అకస్మాత్తుగా కురిసిన వర్షానికి తడిసి ముద్దవ్వడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కళ్లముందే పంట తడిసిపోవడంతో పెట్టుబడి కూడా దక్కదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
Read Also: ట్రంప్ కు హౌతీల హెచ్చరిక.. ప్రపంచ దేశాలకు ముప్పు..!
Follow Us On: Sharechat

