కలం, వెబ్డెస్క్: ఏపీలోని పల్నాడు (Palnadu) జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య మన్పర్థలు ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం గంగుపల్లి తండాకు చెందిన ఓ దంపతులకు కొద్ది కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ కారణంతో సదరు భార్య తన భర్త, ఆరేళ్ల కొడుకును వదిలి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో భర్త కొడుకుతో కలిసి ఉంటున్నాడు. తిరిగి కాపురానికి రావాలని భర్త తరచూ ఆమెను బతిమాలాడు. కానీ ఆమె నిరాకరించడంతో మనస్తాపానికి గురై తన కుమారుడిపై కక్ష పెంచుకున్నాడు. ఆ బాలుడికి కూల్ డ్రింక్లో గడ్డి మందు కలిపి తాగించాడు. ఆ తర్వాత తాను కూడా అదే తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
స్థానికులు గమనించి తండ్రీకొడుకులను వెంటనే నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. నిందితుడైన తండ్రి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కాలయముడిగా మారి పసి ప్రాణాన్ని తీయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Read Also: ఆపరేషన్ ఆక్టోపస్ 2.0.. దేశ వ్యాప్తంగా 52 మంది అరెస్ట్!
Follow Us On: Instagram

