కలం, నల్లగొండ బ్యూరో: 2026 చివరి నాటికి బీబీనగర్ ఎయిమ్స్ను పూర్తి చేసి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రారంభం చేయిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. మంగళవారం ఆయన బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 201 ఎకరాల విస్తీర్ణంలో 750 పడకలతో, అన్ని రకాల వైద్య సేవలతో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.
ఇప్పటివరకు 86 శాతం పనులు పూర్తయ్యాయని, జనవరి 1 నుంచి ఎమర్జెన్సీ సేవలను ప్రారంభించామని వెల్లడించారు. ప్రస్తుతం 250 పడకలతో హాస్పిటల్ సేవలందిస్తోందని, నిత్యం 1800 నుంచి 2 వేల మంది వరకు ఓపీ రోగులు వస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఎయిమ్స్లో 850 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, అక్కడ పాత భవనాలు ఉండటం వల్ల పనులు పూర్తి కావడంలో కొంత జాప్యం జరుగుతోందని కిషన్ రెడ్డి తెలిపారు.
ఎయిమ్స్ (AIIMS)ను దేశంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, రోగుల వెంట వచ్చే అటెండర్ల కోసం ‘అమృత నివాసం’ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలు ఎయిమ్స్లో అమలయ్యే విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని, వాటిపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని చెప్పారు. ఎంఎంటీఎస్ పనులు పూర్తయితే రోగులకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని కిషన్ రెడ్డి అన్నారు.


