కలం, వెబ్ డెస్క్: పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ (Bandi Bhagirath)పోలీసులకు లొంగిపోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. సత్యమేవ జయతే అంటూ చట్టంపై తనకున్న నమ్మకం, గౌరవంతోనే తన కుమారుడిని అడ్వొకేట్ల ద్వారా పోలీసుల విచారణకు అప్పగించానని ఆయన స్పష్టం చేశారు. చట్టం ముందు తన బిడ్డ అయినా, సామాన్యుడు అయినా ఒకటేనని, అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందేనని బండి పునరుద్ఘాటించారు. తన కుమారుడు ఏ తప్పూ చేయలేదని పదేపదే చెప్తున్నాడని తెలిపారు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే స్టేషన్లో అప్పగిద్దాం అనుకున్నట్లు వెల్లడించారు. అయితే లాయర్లను సంప్రదించి తమ వద్ద ఉన్న ఆధారాలను వారి ముందు ఉంచడం వల్లే కొంత జాప్యం జరిగిందని వివరించారు.
ఈ కేసుకు సంబంధించి తమ వద్ద ఉన్న ఆధారాలను చూసి కేసు కొట్టేస్తారని, తప్పకుండా బెయిల్ వస్తుందని లాయర్లు చెప్పారని బండి సంజయ్ పేర్కొన్నారు. శనివారం కూడా బెయిల్ వస్తుందని లాయర్లు చెప్పినప్పటికీ. ఇంకా ఆలస్యం చేయడం సరికాదనే ఉద్దేశంతోనే తానే స్వయంగా తన కుమారుడిని తీసుకొచ్చి లాయర్ల ద్వారా విచారణకు అప్పటించినట్లు తెలిపారు. ఈ కేసు విషయంలో సోమవారం నాడు కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ, న్యాయవ్యవస్థపై ఉన్న సంపూర్ణ నమ్మకం, గౌరవంతోనే విచారణకు పంపించానని బండి స్పష్టం చేశారు.

