కలం, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన టీసీఎస్ బీపీఓలో (TCS BPO) కార్పొరేట్ జీహాద్ అంశంలో మరో కీలక అంశం వెెలుగులోకి వచ్చింది. పోలీసులు జరిపిన సీక్రెట్ ఆపరేషన్ ద్వారానే అసలు విషయం బట్టబయలయింది. దాదాపు నెల రోజుల పాటు హౌస్ కీపింగ్ సిబ్బందిగా పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేసి (Police Operation).. ఆఫీసులో జరుగుతున్న అక్రమాలను వెలికితీశారు. సీనియర్ హెచ్ఆర్ అధికారితో సహా ఏడుగురు ఉద్యోగులను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం ఫిబ్రవరిలో మొదలైంది. అక్కడ పనిచేసే ఒక హిందూ యువతిపై మతపరమైన ప్రభావం చూపుతున్నారనే సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. ఆ యువతి ప్రవర్తనలో మార్పులు గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆఫీస్కు పంపడం మానేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మహిళా కానిస్టేబుళ్లతో సహా కొందరిని అండర్ కవర్ ఏజెంట్లుగా పంపారు. వారు ప్రతిరోజూ అక్కడ జరుగుతున్న పరిణామాలను ఉన్నతాధికారులకు నివేదించారు.
ఈ దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి డానిష్ షేక్ అనే ఉద్యోగి ఒక యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు తొలి ఎఫ్ఐఆర్ నమోదైంది. మరో నిందితుడు తౌసిఫ్ అత్తార్ ఫోన్ను పరిశీలించగా, ఇతర మహిళా ఉద్యోగులను కూడా మతపరమైన పద్ధతులు పాటించేలా ఒత్తిడి తెచ్చినట్లు ఆధారాలు లభించాయి. ఇలాంటి వేధింపులపై ఇప్పటివరకు మొత్తం 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నిందితుల్లో టీమ్ లీడర్లు, సీనియర్ స్టాఫ్ ఉండగా, మరో నిందితురాలు నిదా ఖాన్ పరారీలో ఉంది.
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (HR) స్థాయి అధికారి కూడా ఈ కేసులో అరెస్టయ్యారు. బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా, విషయాన్ని వదిలేయాలని ఆమె ఒత్తిడి తెచ్చినట్లు దర్యాప్తులో తేలింది. దీనిపై స్పందించిన టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, ఈ ఘటనలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయని పేర్కొన్నారు. సదరు ఉద్యోగులను కంపెనీ సస్పెండ్ చేసిందని, అంతర్గత విచారణకు ఆదేశించామని తెలిపారు. ప్రస్తుతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఈ కేసును లోతుగా విచారిస్తోంది.

