కలం, వెబ్ డెస్క్: అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడాన్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నారు ఆ తల్లిదండ్రులు. హృదయాన్ని మెలిపెట్టే ఈ విషాదకర సంఘటన ఛత్తీస్గఢ్ (Chhattisgarh) లోని జంజ్గిర్ చంపా జిల్లా దర్దేయి గ్రామంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాపీ మేస్త్రీ కృష్ణ పటేల్(48), రమాబాయి(47) దంపతులకు చాలా ఏళ్ల తర్వాత ఆదిత్య పుట్టాడు. కుమారుడిని భగవంతుడి వరంగా భావించి అల్లారుముద్దుగా పెంచారు. అయితే, 2024లో గ్రామ పూజారితో కలసి ఆలయం పని మీద బయటకు వెళ్లిన ఆదిత్య(21) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.
ఒక్కనాకొక్క కుమారుడిని రోడ్డు ప్రమాదం బలితీసుకోవడంతో అప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు ఎవరితోనూ పెద్దగా కలిసేవాళ్లు కాదు. కుమారున్ని తలచుకొని తమలో తామే కుమిలిపోయేవాళ్లు. ఈ క్రమంలో పూర్తిగా మానసిక వేదన అనుభవించిన ఆ దంపతులు ప్రాణాలు తీసుకోవాలని భావించారు. ఇంటి వెనక ఉన్న పెరట్లోని వేపచెట్టుకు చీరతో ఉరేసుకొని చనిపోయారు. కుమారుడితో తమ అనుబంధాన్ని వివరిస్తూ, అతని మరణంతో తామెంత కుంగిపోతోంది చెబుతూ ఒక సుదీర్ఘ లెటర్, వీడియో రికార్డు చేసి ఈ నెల 16న బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ దంపతుల ఇంటికి ప్రధాన గేటుకు లోపలి వైపు నుంచి తాళం ఉండంతో అనుమానించిన ఇరుగుపొరుగువాళ్లు మంగళవారం పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి లోపలికి వెళ్లి చూసేసరికి ఆ దంపతులు ఉరేసుకొని చనిపోయినట్లు గుర్తించారు. ఈ సంఘటన(Chhattisgarh) గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
Read Also: కమల్ హాసన్ పార్టీకి గుర్తు కేటాయింపు
Follow Us On: Sharechat


