కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని గాంధీ భవన్ లో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు (Ugadi Celebrations) ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. పండితులు నిర్వహించిన పంచాంగ శ్రవణాన్ని ప్రజా ప్రతినిధులు శ్రద్ధగా తిలకించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుప్రజల ఆత్మీయపండగ ఉగాది అని అభివర్ణించారు. ప్రతి ఇంటా ఆనందం, ఆయురారోగ్యం, ఐశ్వర్యాలు ఉండాలని ఆకాంక్షించారు. కొత్త ఆరంభాలకు ఉగాది పండుగ ప్రతీక అని పేర్కొన్నారు. ప్రజల ఆశయాలు నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.
అటు తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు (Ugadi Celebrations) ఘనంగా నిర్వహించారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం చేసిన పండితులు.. ప్రభుత్వ వైఫల్యాలతో ప్రతిపక్షానికి బలం పెరుగుతుందన్నారు. ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు, పాలనా వైఫల్యాలు కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి పెరిగి, ప్రతిపక్షానికి గణనీయంగా బలం చేకూరే అవకాశం ఉందని చెప్పారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే, ప్రత్యామ్నాయ శక్తిగా ప్రతిపక్షం ఎదిగే పరిస్థితులు ఉందని చెప్పారు.
హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామ్చందర్రావు (Ramachandra Rao) అధ్యక్షతన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. పండితులు చేసిన పంచాంగ శ్రవణాన్ని వినయపూర్వకంగా తిలకించారు. ఈ సందర్భంగా రామ్ చందర్ రావు రాష్ట్ర ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో దేశం అద్భుత పథంలో సాగుతోందన్నారు. దేశ ప్రజల అధివృద్దికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. తెలంగాణకు కేంద్ర సాయం ఎప్పుడూ ఉంటుందని చెప్పారు.
అటు తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఆధ్వర్యంగా పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. కవితతో సహా జాగృతి నేతలు వేద పండితులు చెప్పిన పంచాంగ శ్రవణాన్ని శ్రద్ధగా తిలకించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. పరాభవ నామ సంవత్సరంలో తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తునట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలకు జాగృతి ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కొత్త పార్టీతో న్యాయం చేస్తానని చెప్పారు.
Read Also: సీఎం మరో శుభవార్త.. సాదా బైనామా భూములకు త్వరలో పరిష్కారం!
Follow Us On: Instagram

