కలం, వెబ్ డెస్క్: ఫుట్బాల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2026 యుఇఎఫ్ఏ (UEFA) ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ సమయం ఖరారైంది. ఈసారి ఆర్సెనల్, పారిస్ సెయింట్-జర్మైన్ (PSG) జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మే 30న రాత్రి 9:30 గంటలకు ప్రారంభం కానుంది. సాధారణంగా జరిగే సమయం కంటే మూడు గంటలు ముందుగానే ఈ మ్యాచ్ను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల ఆరంభంలో హంగేరీలోని బుడాపెస్ట్లో జరగబోయే ఈ ఫైనల్ పోరుకు రెండు జట్లు అర్హత సాధించాయి. సెమీఫైనల్లో ఆర్సెనల్ జట్టు అట్లెటికో మాడ్రిడ్పై 2-1 ఆధిక్యంతో గెలిచి ఫైనల్ చేరింది. మరోవైపు, PSG జట్టు బేయర్న్ మ్యూనిచ్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 6-5 తేడాతో విజయం సాధించి, వరుసగా రెండో ఏడాది ఫైనల్కు చేరుకుంది. ఆర్సెనల్ జట్టుకు ఇది రెండో ఛాంపియన్స్ లీగ్ ఫైనల్.
గతంలో 2006లో ఫైనల్ చేరినప్పటికీ బార్సిలోనా చేతిలో ఓడిపోయింది. ఇక PSGకి ఇది మూడో ఫైనల్. 2020లో రన్నరప్గా నిలిచిన ఈ జట్టు, 2025లో ఇంటర్ మిలాన్ను ఓడించి ఛాంపియన్గా నిలిచింది. గత సీజన్ లెక్కలు చూస్తే, ఆర్సెనల్, PSG మూడుసార్లు తలపడ్డాయి. అందులో ఒక మ్యాచ్లో ఆర్సెనల్ గెలవగా, మిగిలిన రెండు మ్యాచ్ల్లో PSG విజయం సాధించింది. మ్యాచ్ సమయం మార్పుపై UEFA ప్రెసిడెంట్ అలెగ్జాండర్ సెఫెరిన్ స్పందించారు. యువ ప్రేక్షకులు, అంతర్జాతీయ వీక్షకులకు ఈ మ్యాచ్ మరింత అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
శనివారం రోజున మ్యాచ్ త్వరగా ముగిస్తే, అభిమానులు తమ కుటుంబ సభ్యులతో గడపడానికి వీలుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ భారీ పోరుపై లివర్పూల్ దిగ్గజం స్టీవెన్ గెరార్డ్ స్పందిస్తూ ఆర్సెనల్కు కొన్ని సూచనలు చేశారు. PSG వంటి బలమైన జట్టును ఎదుర్కోవాలంటే ఆర్సెనల్ ఆటగాళ్లు శారీరక దృఢత్వాన్ని, సెట్-పీస్లను సమర్థవంతంగా వాడుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఆర్సెనల్ ఈలోపు ప్రీమియర్ లీగ్ గెలిస్తే, ఆ నమ్మకంతో ఫైనల్లో మరింత బాగా రాణించే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.

