కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లా బాన్సువాడ (Banswada) మండలంలోని కొత్తబాది ఆదర్శ పాఠశాలలో (Kothabadi Model School) ఇద్దరు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. విద్యార్థినులను వేధించడం, వారితో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. బాధిత విద్యార్థినులు వేధింపులు భరించలేక 1098 చైల్డ్ హెల్ప్లైన్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు అందుకున్న అధికారులు వెంటనే స్పందించి ఘటనపై విచారణ చేపట్టారు. అనంతరం ఇద్దరు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. వారిని విధుల నుంచి తప్పించారు. ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్ కమల్ కిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఉపాధ్యాయులు గోపాల్, పవన్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

