కలం, మెదక్ బ్యూరో: ప్రపంచంలో మరే దేశానికి లేని గొప్ప చరిత్ర భారతదేశానికి ఉందని సినీ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) కొనియాడారు. ఈ చారిత్రిక వారసత్వాన్ని (Medak Historic and Cultural Heritage) ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో పర్యాటకాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఆయన ఏడుపాయల వనదుర్గాభవానీ ఆలయం, మెదక్ ఖిల్లా, సీఎస్ఐ కేథడ్రల్ చర్చిని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు ఆయా ప్రాంతాల చారిత్రిక, సాంస్కృతిక విశిష్టతలను విష్ణుకి వివరించారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్టు జిల్లా యంత్రాంగం తెలిపింది.
‘సినిమా షూటింగ్ నిర్వహించే ఆలోచన చేస్తా’..
మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతో పాటు గొప్ప చారిత్రిక నేపథ్యం కలిగిన ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని విష్ణు పేర్కొన్నారు. వాటిని సంరక్షించి భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. హైదరాబాద్ కు అత్యంత సమీపంలో ఉన్న మెదక్ వంటి చారిత్రిక పర్యాటక ప్రాంతాలను ఇప్పటి వరకు సందర్శించకపోవడం తనకు సిగ్గుగా అనిపించిందన్నారు. మన చరిత్రను మనమే తెలుసుకుని, దానిపై గర్వపడాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో తాను నటించే లేదా నిర్మించే చిత్రాల్లో ఇక్కడి పర్యాటక ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించే అవకాశాన్ని తప్పకుండా పరిశీలిస్తామని టూరిజం అధికారులకు మంచు విష్ణు తెలిపారు.

