కలం, వెబ్డెస్క్: గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు (Sai Krishna Missing Case)లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న సీఐ నాగరాజు ఇప్పటికే అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సాయికృష్ణ హత్యకు గురైనట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ హత్యలో సీఐ నాగరాజుకు మరో ఇద్దరు కానిస్టేబుల్స్ సహకరించారని సిట్ విచారణలో తేలింది.
దీంతో నేడు కృష్ణలంక క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్స్ బాబురావు, సాంబయ్యలను సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి బాబురావును ఏ5గా, సాంబయ్యను ఏ6గా పేర్కొన్నారు. ఇప్పటికే సిట్ అధికారులు వీరిద్దరినీ సుధీర్ఘంగా విచారించినట్లు తెలిసింది. భారీ భద్రత నడుమ ఇద్దరిని రెండో ఏసీఎం కోర్టుకు తరలించారు. మరికొద్ది సేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు.

