కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ (Nalgonda) జిల్లాలోని చందనపల్లి స్టేజి సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు బైకును ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్పిఆర్ స్కూల్కు చెందిన బస్సు చందనపల్లి స్టేజి (Chandanapally) వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ధాటికి బైక్ పై ఉన్న ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు.
తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ఇద్దరు మరణించారు. మృతులను నల్గొండ (Nalgonda) జిల్లా శాలిగౌరారం మండలం ఊట్కూరు (Utkoor) గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందా..? లేక ద్విచక్ర వాహనదారుల తప్పిదమా..? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: సూర్య – వెంకీ అట్లూరి న్యూ మూవీ టైటిల్ రివీల్
Follow Us On : WhatsApp

