కలం, వెబ్ డెస్క్: వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన ఇద్దరు వృద్ధ మహిళలు దారుణ హత్యకు గురైన సంఘటన కలకలం రేపుతోంది. తాండూరు నుంచి కనిపించకుండా పోయిన ఈ ఇద్దరు మహిళలను గుర్తుతెలియని దుండగులు హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ (Moinabad) మండలం, చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని తోలకట్ట గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ ఓ ఫాంహౌస్ (Farmhouse) సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాలను అక్కడే పూడ్చిపెట్టారు. ఈ దారుణ ఉదంతంపై సమాచారం అందుకున్న తాండూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘోరానికి పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నారు.

