కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా సారంగాపూర్ మండలంలోని అడెల్లి (Adelli) గ్రామంలో గల మహా పోచమ్మ ఆలయ ప్రాంగణంలో ఆదివారం పిడుగుపాటు (Lightning Strike) సంభవించి ఇద్దరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గోడం గంగాధర్ (45), గోడం స్రవంతి (18) అమ్మవారి దర్శనానికి వచ్చారు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైన సమయంలో ఆలయ ప్రాంగణంలోని చెట్టు వద్ద నిలబడ్డారు. ఈ సమయంలో పిడుగు పడడంతో ఇద్దరూ స్పృహ తప్పి కుప్పకూలారు. ఘటనను గమనించిన ఆలయ సిబ్బంది, స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు.

