కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించి విస్తారంగా వర్షాలు కురుస్తున్న వేళ వర్షాలు, వరద ముప్పు, ప్రకృతి విపత్తుల నిర్వహణపై ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉన్నతాధికారులతో సచివాలయంలో అత్యవసర ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. జూన్ 1 న రివ్యూ పెట్టి వర్షాల పైన ముందస్తు సూచనలు ఇచ్చిన కూడా జూన్ 9 న వర్షం సమయంలో అధికారులు సరిగా పని చేయలేదని చెప్పారు. వర్షం సమయంలో క్యూర్ ఏరియాలో మునిసిపల్, పోలీస్ అధికారుల మధ్య సమన్వయం లేదని మండిపడ్డారు. వర్షం పడే సమయంలో ఫీల్డ్ లో ఉండని అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వర్షం సమయంలో ట్రాఫిక్ ఉన్నతాధికారుల నుంచి కింద స్థాయి సిబ్బంది వరకు రోడ్ల పైన ఉండాల్సిందేనని.. అవసరం అయితే తాను కూడా రోడ్డు మీదకు వస్తానని వ్యాఖ్యానించారు.
వర్షాకాలంలో విద్యుత్ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వర్షం వచ్చినప్పుడు వాటర్ లాగింగ్ పాయింట్స్, బ్లాక్ స్పాట్స్, ట్రాఫిక్ జామ్ ఏర్పడే ప్రాంతాల డేటా ఆధారంగా పని చేయాలన్న సీఎం.. వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ అయితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. మానవ తప్పిదాల వల్ల సమస్యలు వస్తే సహించనని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో తక్షణమే ఖాళీలు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు.

