కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో వీధి కుక్కలు (Stray Dogs), కోతులు స్వైరవిహారం చేస్తున్నాయి. ముఖ్యంగా గోదారమ్మ క్యాంపు కాలనీలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు.. కనిపించిన ప్రతిఒక్కరిపై విరుచుకుపడుతున్నాయి. నిత్యావసరాలు, కూరగాయల కోసం రోడ్డుపైకి వెళ్లడమే పాపమైపోతోంది. చేతిలో కవర్లు, బ్యాగులను చూసి ఆహారం ఉందనే భ్రమతో కుక్కలు, కోతులు మనుషులపై ఎగబడుతున్నాయి. వాటిని భయపెట్టడానికి ప్రయత్నిస్తే రెచ్చిపోయి దాడి చేస్తున్నాయి.
గోదారమ్మ క్యాంపులో గత వారం రోజుల క్రితమే నలుగురు వీధి కుక్కల దాడిలో గాయపడగా, ఆదివారం కూడా ఓ మహిళపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీ పాలకవర్గం గతంలో తీసుకున్న తీర్మానాల ప్రకారం.. వీధుల్లో సంచరిస్తున్న కుక్కలను, కోతులను వెంటనే తరలించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
సారపాకలో కుక్కలు, కోతులు స్వైరవిహారం.. భయభ్రాంతుల్లో ప్రజలు

