జిల్లాల వారీగా పంట ప్రణాళికలను సిద్ధం చేయాలి: మంత్రి తుమ్మల

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం, సాధారణం కంటే తక్కువ వర్షపాతం దృష్ట్యా రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం ముందస్తు పంట ప్రణాళికపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao) అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. మే 15 లోగా వాతావరణ శాఖ నుండి వివరణాత్మక నివేదికను పొందాలని.. వర్షపాత అంచనాలు స్థానిక వ్యవసాయ-వాతావరణ పరిస్థితుల ఆధారంగా జిల్లా వారీగా పంట ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బహిరంగ మార్కెట్లో అధిక గిరాకీ ఉన్న నాణ్యమైన వరి రకాలను మాత్రమే రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. వీలైనంత వరకు కనీస మద్దతు ధర (MSP) కంటే ఎక్కువ ధర లభించేలా చూడాలని మంత్రి నొక్కి చెప్పారు. గత కొన్నేళ్లుగా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల సాగులో తీవ్ర క్షీణతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, వాటి సాగు విస్తీర్ణాన్ని పెంచడానికి ఒక ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించాలని ఆదేశించారు.

ఏకపంట సాగు వల్ల నష్టాలు..

నిత్యావసర పంటల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా తెలంగాణ స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని మంత్రి ఆకాంక్షించారు. అత్యధిక వరి సాగు వల్ల నేల సారవంతం తగ్గి, యూరియా వినియోగం పెరుగుతోందని పేర్కొన్నారు. ఏకపంట సాగు వల్ల కలిగే నష్టాలను కూడా ఆయన ఎత్తి చూపారు. ఎరువుల ధరలలోని అసమతుల్యత రైతులను అధిక యూరియా వాడకం వైపు నెడుతోందన్నారు.ఎరువుల ధరలను కేంద్రం హేతుబద్ధీకరించాలని తమ డిమాండ్‌ను నెరవేర్చాలన్నారు. రాబోయే సీజన్‌కు అవసరమైన సేకరణ అవసరాలను అంచనా వేయాలన్నారు. రైతులు ఇష్టపడే, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న రకాల విత్తనాలను సరఫరా చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా సేకరణ, మార్కెట్ వ్యూహాలను సమన్వయం చేయడానికి మిల్లు యజమానులు, ఎఫ్‌సీఐతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>