కలం, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులపై తెలంగాణ ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ టీజీఐఆర్డీలో శుక్రవారం ఎల్నినో ప్రభావం, వివిధ ప్రభుత్వ రంగాల్లో చేపట్టాల్సిన ముందస్తు కార్యాచరణపై మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరితో తుమ్మల రాష్ట్రస్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, సీఎస్ సంజయ్ జాజు, స్పెషల్ సీఎస్ దానకిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల కంటే ముందుగానే ఎల్నినో ప్రభావాన్ని ఎందుర్కొనేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందన్నారు. ముఖ్యంగా గ్రామస్థాయిలో ప్రతి శాఖకు విడివిడిగా కాకుండా వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్థక, మత్స్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి గ్రామానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

