కలం, వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని యాతాలకుంట టన్నెల్ (Yathalakunta Tunnel) నిర్మాణ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానిక ప్రజాప్రతిధులతో కలిసి ట్రాక్టర్ ని స్వయంగా నడుపుతూ టన్నెల్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా టన్నెల్ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలు, పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి అయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ టన్నెల్ నిర్మాణం పూర్తయితే పరిసర ప్రాంతాల్లో సాగునీటి సదుపాయాలు మెరుగుపడటంతో పాటు రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో నీటి వనరుల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం భారీ స్థాయిలో సాగునీటి ప్రాజెక్టులను అమలు చేస్తోందన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల అక్కడి ఇంజినీరింగ్ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని హెచ్చరించారు. ప్రజాధనం వృథా కాకుండా ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.

