కలం, నిర్మల్: అడవి తల్లిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసులపై అటవీ శాఖ అధికారుల దాష్టీకం మితిమీరుతోందని, ఇకపై ఏమాత్రం సహించేది లేదని తుడుం దెబ్బ (Tudum Debba) రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకగారి భూమయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జిల్లా కేంద్రంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా ఇందన్పల్లి పరిధిలో అమాయక నాయక పోడు గిరిజనులపై అటవీ శాఖ అధికారులు కక్షకట్టి భౌతిక దాడికి దిగడాన్ని తీవ్రంగా ఖండించారు. ‘జల్, జంగల్, జమీన్’ నినాదంతో తమ హక్కుల కోసం, పోరాడుతున్న అడవి బిడ్డల గొంతు నొక్కాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ఇందన్పల్లి ఘటనలో ఆదివాసులపై నేరుగా భౌతిక దాడికి దిగిన డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఓ) నిర్వాకం దుర్మార్గమైనదని పేర్కొన్నారు. అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తుడుం దెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంచు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి తోడుసం గోవర్ధన్, జిల్లా సభ్యులు రామకృష్ణ పాల్గొన్నారు.

