కలం, వెబ్ డెస్క్ : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె అనూషకు (Botsa Anusha) కీలక బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అధినేత ఆదేశాల మేరకు భీమిలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా అనూషను వైసీపీ అధిష్టానం నియమించింది. భీమిలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా ఉన్న బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు ( చిన్న శ్రీను) ఇటీవలే వైసీపీని వీడి టీడీపీలో చేరిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నారు.
భీమిలిలో స్థానిక నాయకులను, కార్యకర్తలను ఏకతాటిపైకి తెచ్చి పార్టీని బలోపేతం చేయడం కోసం బొత్స అనూషకు ఈ బాధ్యత అప్పగించినట్లు వైసీపీ అధిష్టానం తెలిపింది. దీంతో వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లైంది. అనూష రాజకీయాల్లోకి రాకముందు ధీరా ఫౌండేషన్, సత్య ఎడ్యుకేషన్ సొసైటీల్లో డైరెక్టర్గా సేవలందిస్తూ .. వైద్య, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక ఇప్పుడు తండ్రి బాటలోనే నడుస్తూ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని అనుకుంటున్నారు. కాగా, తనను భీమిలి నియోజవర్గ పార్టీ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించినందుకు వైఎస్ జగన్ కు అనూష ధన్యవాదాలు తెలిపారు. భీమిలిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.

