కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ కు ఆయుధాలు సరఫరా చేయబోమని చైనా అంగీకరించినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ లో వెల్లడించారు. ఈ క్రమంలోనే హార్మూజ్ జలసంధిని శాశ్వతంగా తెరిచి ఉంచుతున్నట్లు స్పష్టం చేశారు. ఇది చైనా కోసం మాత్రమే కాదు.. ప్రపంచ దేశాల కోసం తెరిచి ఉంచుతున్నట్లు తెలిపారు. దీంతో హార్మూజ్ జలసంధి దగ్గర ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండవని చెప్పారు.
తన నిర్ణయం పట్ల ప్రపంచదేశాలతో పాటు చైనా కూడా సంతోషంగా ఉందని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ప్రస్తుతం బీజింగ్ తో సంబంధాలు మెరుగుపడుతున్నాయని చెప్పుకొచ్చారు. అక్కడి అధ్యక్షుడు జిన్ పింగ్ ను త్వరలోనే కలుసుకునే అవకాశం ఉందని తెలిపారు. పోరాటం కంటే శాంతి మంచిదని బోధనలు చేసిన ట్రంప్.. అవసరమైతే అమెరికా యుద్ధం చేయడంలో కూడా వెనుకాడదని మెలిక పెట్టారు. అయితే ఇరాన్ కు ఆయుధా సరఫరా నిలిపివేతపై డ్రాగన్ కంట్రీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారింది.

