కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు నడుస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ కవిత (Kavitha) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పటాన్చెరులో నిర్వహించిన పార్టీ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని, పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కవిత మాట్లాడుతూ.. ప్రస్తుత పటాన్చెరు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. గత కొన్నేళ్లుగా సదరు ఎమ్మెల్యే వ్యక్తిగతంగా బాగా అభివృద్ధి చెందారు తప్ప, నియోజకవర్గ ప్రజలకు మాత్రం ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని విమర్శించారు. పటాన్చెరు పరిధిలో అన్ని పార్టీల నాయకులు ఒకటై దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనికి ఉదాహరణగా.. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తాడంటూ ఆమె వ్యాఖ్యానించారు.
నియోజకవర్గంలో కబ్జాదారుల అరాచకాలు మితిమీరిపోయాయని, పట్టపగలే ప్రభుత్వ పాఠశాలను బుల్డోజర్లతో కూల్చేసి భూములను దోచుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటికీ, పటాన్చెరు ప్రాంతంలో కాలుష్య సమస్య తీవ్రరూపం దాల్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజల పక్షాన నిలిచి, పటాన్చెరు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై తమ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా కవిత స్పష్టం చేశారు.

