కలం, వెబ్ డెస్క్ : భారత్, ఇండోనేషియా (India-Indonesia) దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం సరికొత్త వేగాన్ని సంతరించుకుందని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 8వ భారత్ – ఇండోనేషియా జాయింట్ కమిషన్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. నాలుగేళ్ల విరామం తర్వాత ఈ సంయుక్త కమిషన్ సమావేశం జరగడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
గత ఏడాది భారత్, ఇండోనేషియా దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాల 75వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాయని గుర్తుచేశారు. ఇందులో భాగంగానే గత ఏడాది భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరయ్యారని వివరించారు. ఆ పర్యటనలో ప్రబోవో సుబియాంటోతో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన చర్చలు ఇరుదేశాల బహుముఖ సంబంధాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డాయని, ఆ మార్గదర్శకత్వం ఎంతో విలువైనదని జైశంకర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

