కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదం కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా(NTR district) కంచికచర్ల మండలంలో ఓ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. శనివారం తెల్లవారుజామున కీసర(Keesara) టోల్గేట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు వెనుక భాగంలోని ఇంజిన్ నుండి పొగలు రావడంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి ప్రయాణికులను కిందికి దించారు. డ్రైవర్ అప్రమత్తతతో ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. అయితే ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


