కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల (Jagtial) జిల్లా మల్యాల మండలం కొత్తపేటలో పెను ప్రమాదం తప్పింది. గురువారం మధ్యాహ్నం ట్రాన్స్ఫార్మర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విపరీతమైన ఎండ తీవ్రత కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని విద్యుత్తు అధికారులు తెలిపారు. నియంత్రిక నుంచి మంటలు, పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే విద్యుత్తు సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వారు వార్డు సభ్యుడు గణేష్, స్థానికుల సహాయంతో మంటలను అదుపు చేశారు. సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్థులు తెలిపారు. వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో విద్యుత్ పరికరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని విద్యుత్తు అధికారులు సూచించారు.

