కలం, నిజామాబాద్ బ్యూరో: వినాయక చవితిని పురస్కరించుకుని నిజామాబాద్(Nizamabad) కలెక్టరేట్లో శుక్రవారం అదనపు కలెక్టర్ (Additional Collector) భుజంగరావు మట్టి గణపతులను పంపిణీ చేశారు. జిల్లా రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ద్వారా మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తున్న హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలోనూ ప్రభుత్వం మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తోందని తెలిపారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయనిక రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాల వల్ల జల వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రజలంతా మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, డీఆర్ఓ గీత, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, బోధన్ ఆర్డీఓ విజయకుమారి, రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, ప్రశాంత్, కలెక్టరేట్ డీ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

