కలం, వెబ్డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao ) పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో వర్షాలు పడొద్దని, కరువు రావాలని హరీశ్ రావు క్షుద్ర పూజలు చేయిస్తున్నారని మహేశ్ కుమార్ అన్నారు. ఇటీవల ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సైతం హరీశ్ రావుపై ఇలాంటి ఆరోపణలే చేశారు. ఈ నేపథ్యంలో హరీశ్ రావు ఆయనకు నోటీసులు పంపించారు. తనపై చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పి, ఆ వీడియోలను డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
తాజాగా మహేశ్ కుమార్ ఈ క్షుద్రపూజల ఆరోపణలకు మద్దతు తెలిపారు. హరీశ్ రావు క్షుద్ర పూజలు చేశారని తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. అఘోరాలు, తాంత్రికులతో తిరగడం, క్షుద్ర పూజలు చేయడం వాళ్లకు అలవాటేనన్నారు. హరీశ్ తిరుచ్చి, శివమొగ్గకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలకు రాష్ట్రం, ప్రజలు ఏమైపోయినా అవసరం లేదని వ్యాఖ్యానించారు. హరీశ్ రావు అరుంధతిలో పశుపతిలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గతంలో కేసీఆర్ ఫాంహౌస్లో క్షుద్రపూజలు జరిగాయని వార్తలు వచ్చాయని, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవి నిజమేనని అనిపిస్తోందని అన్నారు. దీనిపై హరీశ్ రావు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

