కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal)లో ఓటమి తర్వాత టీఎంసీ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ నేతలకు ఎదురవుతున్న వ్యతిరేకత, ఇప్పటికే పార్టీలో నెలకొన్న అనిశ్చితికి తోడు తాజాగా టీఎంసీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. నెల రోజుల క్రితం పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రిమా భట్టాచార్య (Chandrima Bhattacharya) తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
జూన్ 5న మమతా బెనర్జీ నివాసమైన కలకత్తా కలీఘాట్లో జరిగిన పార్టీ జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశంలో చంద్రిమాను బెంగాల్ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించారు. దీదీకి అత్యంత సన్నిహితురాలైన చంద్రిమా రాజీనామా నిర్ణయం తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమె రాజీనామాకు గల కారణాలపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ ఘటనతో బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ పరిస్థితిపై కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

