కలం, వెబ్ డెస్క్ : తిరుపతి (Tirupati) జిల్లా వెంకటకృష్ణపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు వేర్వేరు చోట్ల శవమై కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మోహన్ అనే వ్యక్తి కుటుంబం మొత్తం విగతజీవులుగా మారడంతో ఈ మరణాల వెనుక ఉన్న అసలు కారణాలు ఇప్పుడు మిస్టరీగా మారాయి.
ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం, మోహన్ నివాసంలో ఆయన తల్లి చంద్రకళతో పాటు భార్య హరిత వేర్వేరు గదుల్లో విగతజీవులుగా కనిపించారు. హరిత మెడకు చున్నీ బిగించి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. మరోవైపు వేపగుంట సమీపంలోని రైలు పట్టాలపై మోహన్, ఆయన కుమారుడు కౌశిక్, కుమార్తె హిమాని మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఒకే కుటుంబంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఘటన హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కుటుంబ కలహాలా లేక ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మరణాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

