కలం, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయాలు తిరుమల వేంకటేశ్వర స్వామి చుట్టే తిరుగుతున్నాయి. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణలతో మొదలైన వ్యవహారం రోజురోజుకీ ముదురుతోంది. ఏపీ శాసన మండలి (AP Council)లో కల్తీ నెయ్యి అంశం, హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీల మధ్య సంబంధంపై చర్చించాలని వైసీపీ సభ్యులు కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు వేంకటేశ్వర స్వామి ఫోటోలతో సభలో నిరసన వ్యక్తం చేశారు. గోవిందా గోవిందా నినాదాలతో మండలి మారుమోగింది.
సభలో వేంకటేశ్వరస్వామి ఫోటోలు ప్రదర్శించడం, అనంతరం టేబుల్పైనే వేసి వెళ్లడంపై కూటమి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మంత్రులు నారా లోకేష్, అనిత, గొట్టిపాటి రవి కుమార్, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, పిడుగు హరిప్రసాద్, టీడీపీ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ మోషేన్ రాజును కలిసి ఫిర్యాదు చేశారు. వైసీపీ సభ్యులు దేవుడిని అవమానించారని పిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సభకు దేవుడి ఫోటోలు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. సభలో వేంకటేశ్వర స్వామి ఫోటోలను ప్లకార్డులుగా ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. వైసీపీ సభ్యులు చెప్పులు వేసుకొని వేంకటేశ్వర స్వామి ఫోటోలను ప్లకార్డులుగా ప్రదర్శిస్తూ ర్యాలీగా వచ్చారన్నారు. ప్రత్యక్ష దైవంగా కొలిచే వేంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు. ఈ ఘటనతో వైసీపీ నేతలకు, జగన్కు దేవుడి పట్ల ఏ రకమైన ఆలోచన ఉందో తెలుస్తోందన్నారు. ప్రతిరోజు వైసీపీ సభ్యులు సభలో వేంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తున్నారని మండిపడ్డారు. శాసన మండలిలో వైసీపీ సభ్యుల తీరు హిందువుల మనోభావాలను దెబ్బతిసేలా ఉందని విమర్శించారు.


