కలం, వెబ్ డెస్క్: అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ చారిత్రక విజయానికి చేరువవగా, న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది(New Zealand Collapse). 256 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్కు, ఆ జట్టు టాప్ స్కోరర్ టిమ్ సీఫెర్ట్ అవుట్ కావడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. కేవలం 8.1 ఓవర్లలోనే 72 పరుగుల వద్ద 5 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ విలవిలలాడుతోంది. ప్రస్తుతం సగం ఓవర్లు ముగిసేసరికి 88/5తో ఉంది.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ను నిలబెట్టేందుకు ప్రయత్నించిన ఏకైక బ్యాటర్ టిమ్ సీఫెర్ట్. ఈ ఓపెనర్ కేవలం 26 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 52 పరుగులు చేసి ప్రమాదకరంగా మారాడు. అయితే, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయి.. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ పట్టిన సూపర్ క్యాచ్తో వెనుదిరిగాడు. సీఫెర్ట్ అవుట్ కావడంతో కివీస్ శిబిరంలో ఆందోళన మొదలైంది.
భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ కకావికలమైంది(New Zealand Collapse). టిమ్ సీఫెర్ట్ 52 పరుగులు (వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అవుట్), ఫిన్ అలెన్ 9 పరుగులు (అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్), రచిన్ రవీంద్ర 1 పరుగు (జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో అవుట్), గ్లెన్ ఫిలిప్స్ 5 పరుగులు (అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్), మార్క్ చాప్మన్ 3 పరుగులు (హార్దిక్ పాండ్యా బౌలింగ్లో అవుట్) చేసి పెవిలియన్కు చేరారు.
టీమిండియా బౌలర్లు సమష్టిగా రాణిస్తూ కివీస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అక్షర్ పటేల్ 2 ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రా కేవలం 9 పరుగులే ఇచ్చి ఒక వికెట్ సాధించాడు. వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా కూడా తలా ఒక వికెట్ పడగొట్టి న్యూజిలాండ్ పతనాన్ని శాసించారు. ప్రస్తుతం క్రీజులో డారిల్ మిచెల్ (1*) ఉండగా, భారత్ విజయానికి కేవలం ఐదు వికెట్ల దూరంలో ఉంది. టీమిండియా ప్రపంచ ఛాంపియన్గా అవతరించడానికి రంగం సిద్ధమైంది.

