కలం, ఖమ్మం బ్యూరో: విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని ఖమ్మం(Khammam) జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (Agriculture Officer) బాబురావు సూచించారు. బిల్లు లేకపోతే విత్తన లోపాలు తలెత్తినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండదని ఆయన హెచ్చరించారు. నకిలీ విత్తనాల బారిన పడకుండా ప్రభుత్వం గుర్తించిన లైసెన్స్ కలిగిన విత్తన విక్రయ కేంద్రాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావడం, పంటల దిగుబడిని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న “విత్తన మేళా–2026”(Seed Mela 2026) కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఎల్-నినో పరిస్థితుల నేపథ్యంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పంటల ఎంపిక చేసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా కంది, పెసర, మినుము, శనగ వంటి పప్పుధాన్యాలు, జొన్న, సజ్జ, కొర్రలు వంటి చిరుధాన్యాల సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని అన్నారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో ప్యాకెట్పై ఉన్న బ్యాచ్ నంబర్, గడువు తేదీ, మొలక శాతాన్ని పరిశీలించాలని, కొనుగోలు బిల్లులను భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. స్థానిక నేలలకు అనుగుణంగా పంటల ఎంపిక కోసం మండల వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని తెలిపారు. విత్తనాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని బాబురావు రైతులకు విజ్ఞప్తి చేశారు.

